ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల అమ్మకాలపై టీవీపీ ఆందోళన.

ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల అమ్మకాలపై టీవీపీ ఆందోళన.

ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా.. స్పందించకపోతే డీఈఓ కార్యాలయ ముట్టడి హెచ్చరిక.

బోధన్ ప్రతినిధి రాహుల్ : ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్నారంటూ తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీవీపీ) ఆధ్వర్యంలో గురువారం బోధన్ ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా టీవీపీ బోధన్ డివిజన్ అధ్యక్షుడు మీసాలె నాగేష్ మాట్లాడుతూ, గత వారం రోజులుగా ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల విక్రయాలపై తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు రావడంతో పలు పాఠశాలలను ప్రశ్నించగా, విద్యాశాఖ అధికారుల సూచన మేరకే పుస్తకాలు విక్రయిస్తున్నామని యాజమాన్యాలు తెలిపినట్లు చెప్పారు. ఈ విషయమై ఎంఈఓను సంప్రదించగా, ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల అమ్మకాల నిబంధనలపై తనకు అవగాహన లేదని సమాధానం ఇచ్చారని ఆరోపించారు.

 

అవగాహన లేని ఎంఈఓను వెంటనే బదిలీ చేసి, కొత్త అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. అలాగే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల విక్రయాలను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బయట మార్కెట్లో రూ.2,000 నుంచి రూ.2,500 వరకు లభించే పుస్తకాలను ప్రైవేట్ పాఠశాలలు రూ.6,000 నుంచి రూ.10,000 వరకు విక్రయిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలలు సూచించే పుస్తకాలు కనీసం మూడు వేర్వేరు బుక్ స్టాల్స్‌లో అందుబాటులో ఉండేలా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాల్సి ఉండగా, అనేక పాఠశాలలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని విమర్శించారు.

 

 

పేద, మధ్యతరగతి కుటుంబాలపై అధిక ఫీజులు, పుస్తకాల భారం పడుతోందని పేర్కొంటూ, విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టి డీఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టీవీపీ డివిజన్ కార్యదర్శి నిఖిల్, పట్టణ కార్యదర్శి వీరేష్, రాజ్ రతన్ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.