మాజీ సర్పంచ్ వెంకన్న కుటుంబానికి ఎమ్మెల్యే పోచారం ఆర్థిక సాయం.
వర్ని ప్రతినిధి చందర్ : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలేపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మైసం వెంకన్న భూ వివాదం నేపథ్యంలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనతో విషాదంలో ఉన్న వెంకన్న కుటుంబాన్ని బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు.
ఆదివారం తన నివాసంలో వెంకన్న కుటుంబ సభ్యులకు మానవతా దృక్పథంతో రూ.1 లక్ష నగదు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుటుంబానికి జరిగిన నష్టంపై సానుభూతి వ్యక్తం చేస్తూ, సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు.

ఎమ్మెల్యే అందించిన ఆర్థిక సహాయానికి వెంకన్న కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వెంకన్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
