బీ.జే.పీ జెండాలతో ర్యాలీ నిర్వహించిన నాయకులు, కార్యకర్తలు.
నిజామాబాద్ ప్రతినిధి రాహుల్ : బోధన్ మండలంలో బెంగాల్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సాధించిన విజయాన్ని పురస్కరించుకుని సోమవారం ఘనంగా సంబరాలు నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడి ఆనందాన్ని వ్యక్తం చేశారు.
పట్టణ అధ్యక్షుడు ఆధ్వర్యంలో బ్యాండ్ బాజాలతో ఊరేగింపు నిర్వహించగా, కార్యకర్తలు పటాకులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. బీజేపీ జెండాలు ఎగురవేస్తూ, నినాదాలతో ప్రాంతమంతా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా బీజేపీకి పెరుగుతున్న ఆదరణకు బెంగాల్ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడమే పార్టీ లక్ష్యమని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీని మరింత బలపరచాలని, ప్రజలకు దగ్గర చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
