నీట్ విద్యార్థులపై లాఠీచార్జీకి నిరసనగా రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ విజయవంతం.

నీట్ విద్యార్థులపై లాఠీచార్జీకి నిరసనగా రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ విజయవంతం.

బోధన్ ప్రతినిధి రాహుల్‌: నీట్ విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి నిరసనగా ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్, ఏఐపీఎస్‌యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపుతో నిర్వహించిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విజయవంతమైందని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. జిల్లాలోని ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, వృత్తి విద్య, హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలల విద్యార్థులు బంద్‌కు విశేషంగా సహకరించారని పేర్కొన్నారు.

 

 

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జంతర్‌మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నీట్ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడం ఖండనీయమని అన్నారు. నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకల వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, భవిష్యత్తులో పరీక్షల లీకేజీలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే నీట్ పరీక్షల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించి పారదర్శకంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పార్లమెంట్‌లో నీట్ విద్యార్థుల సమస్యలపై స్పందించకపోవడాన్ని విమర్శించిన నాయకులు, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని ఖండించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

 

 

 

ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి బానోత్ రఘురాం, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శులు జన్నారపు రాజేశ్వర్, అనిల్ కుమార్, ఏఐఎఫ్‌డీఎస్ జాతీయ కన్వీనర్ మైత్రి రాజశేఖర్, ఏఐపీఎస్‌యూ జిల్లా నాయకులు, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, ఆర్‌వైఎఫ్ తదితర విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.