యూనియన్ బ్యాంక్‌లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం.

యూనియన్ బ్యాంక్‌లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం.

కామారెడ్డి ప్రతినిధి :-  నాగిరెడ్డిపేట మండలంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో ఆదివారం సైబర్ నేరాలు, ఓటీపీ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు నాగిరెడ్డిపేట ఎస్‌ఐ ఐ.ఏ. భార్గవ్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

 

 

 

సైబర్ మోసాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100ను సంప్రదించాలని పోలీసులు సూచించారు. బ్యాంకు అధికారులు గానీ, పోలీసులు గానీ ఓటీపీ వివరాలు అడగరని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలను ఇతరులకు చెప్పవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు.

పోలీస్ కళాబృందం ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుళ్లు రామంచ తిరుపతి, శేషరావు, పోలీస్ సిబ్బంది ప్రభాకర్, సాయిలు పాటలు, సందేశాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి షీ టీమ్ పోలీస్ కానిస్టేబుల్ శ్రీశైలం, మహిళా పోలీస్ కానిస్టేబుల్ సుప్రజ, బ్యాంక్ మేనేజర్ సాగర్ షిండే, బ్యాంక్ సిబ్బంది, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఖాతాదారులు పాల్గొన్నారు.