మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం.
వర్ని ప్రతినిధి చందర్:- రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి N. Uttam Kumar Reddy ఈ నెల 10వ తేదీన బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే Pocharam Srinivas Reddy సోమవారం పరిశీలించారు.
రూ.106 కోట్ల వ్యయంతో నిర్మించిన జాకోర, చందూర్ ఎత్తిపోతల పథకాల ప్రారంభోత్సవంతో పాటు సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా హెలిప్యాడ్ స్థలం, సభా ప్రాంగణం, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. మంత్రి పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
కార్యక్రమంలో వర్ని, చందూర్ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
