తెలంగాణ ఉద్యమ కేసులో కోర్టుకు హాజరైన జోరిక రమేష్ తదితరులు.
ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్.
హనుమకొండ ప్రతినిధి : తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులో భాగంగా బుధవారం హనుమకొండ జిల్లా 3వ ఎంఎం కోర్టులో తెలంగాణ ఉద్యమ నేతలు హాజరయ్యారు. 2014 జూన్ 1వ తేదీన హనుమకొండలో ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో సుబేదారి పోలీస్ స్టేషన్లో సీసీ నెం. 3814/2022 కేసు నమోదైంది.
ఈ కేసులో ట్రయల్ రన్లో భాగంగా గ్రేటర్ వరంగల్ మాజీ కార్పొరేటర్, బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏ 1 జోరిక రమేష్, ఏ 2 బోడ డిన్న, ఏ 3 చాగంటి రమేష్లు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. కేసు తదుపరి విచారణను 2026 జులై 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జడ్జి ప్రకటించారు.
ఉద్యమకారుల పక్షాన లీగల్ సెల్ న్యాయవాదులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తాళ్ళపల్లి జనార్దన్ గౌడ్, గుర్రాల వినోద్, చందు తదితరులు వకాల్తా పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నేత జోరిక రమేష్ మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులపై ఉన్న 99 శాతానికి పైగా కేసులను ఎత్తివేశారని గుర్తుచేశారు. కేవలం కొన్ని కేసులు మాత్రమే సాంకేతిక కారణాలతో పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమ కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఉద్యమకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు పెండింగ్లో ఉన్న అన్ని కేసులను తక్షణమే ఎత్తివేయాలని జోరిక రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
