టీజీవీపీ ఆధ్వర్యంలో బోధన్ ఎస్సీ బాలుర హాస్టల్ సందర్శన.
బోధన్ ప్రతినిధి రాహుల్ : తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) నాయకులు బోధన్ పట్టణంలోని శక్కర్నగర్ ఎస్సీ బాలుర సాంఘిక సంక్షేమ హాస్టల్ను శనివారం సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా టీజీవీపీ బోధన్ డివిజన్ కార్యదర్శి మదరోళ్ల నిఖిల్ విద్యార్థులతో సమావేశమై హాస్టల్లో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందుతున్నదా, తాగునీరు, విద్యుత్, పరిశుభ్రత, వసతి వంటి మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా అనే అంశాలను పరిశీలించినట్లు తెలిపారు.

విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, వాటి పరిష్కారానికి తెలంగాణ విద్యార్థి పరిషత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అవసరమైతే సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీజీవీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
