లైన్స్ క్లబ్ కంటి ఆస్పత్రికి రూ.10 లక్షల విరాళం అందించిన ఎన్నారై డాక్టర్ రవీందర్ రెడ్డి.
బోధన్ ప్రతినిధి రాహుల్: బోధన్లోని లైన్స్ క్లబ్ కంటి ఆస్పత్రి అభివృద్ధితో పాటు పేదలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలను మరింత విస్తరించేందుకు అమెరికా (యూఎస్ఏ)లో నివసిస్తున్న ప్రముఖ ఎన్నారై డాక్టర్ రవీందర్ రెడ్డి రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. మంగళవారం ఆయన తరఫున వారి బంధువు ప్రభు రెడ్డి విరాళానికి సంబంధించిన చెక్కును లైన్స్ ట్రస్ట్ సభ్యులకు అందించారు.
ఈ సందర్భంగా లైన్స్ ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ, డాక్టర్ రవీందర్ రెడ్డి గతంలో కూడా ఆస్పత్రి అభివృద్ధికి, పేద రోగులకు వైద్య సేవలు అందించేందుకు పలుమార్లు ఆర్థిక సహాయం చేశారని తెలిపారు. ఇటీవల ఆస్పత్రిని సందర్శించిన ఆయన అక్కడి పారిశుధ్య నిర్వహణ, అత్యాధునిక వైద్య పరికరాలతో అందిస్తున్న ఉచిత నేత్ర వైద్య సేవలు, శస్త్రచికిత్సలను అభినందించి, భవిష్యత్తులో కూడా తనవంతు సహకారం కొనసాగిస్తానని పేర్కొన్నారని తెలిపారు.

రూ.10 లక్షల విరాళం అందించిన డాక్టర్ రవీందర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు లైన్స్ ట్రస్ట్ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్స్ మేనేజింగ్ ట్రస్టీ పి. బసవేశ్వరరావు, లైన్స్ ఐ ఆస్పత్రి చైర్మన్ నరసింహారెడ్డి, సభ్యులు ఉమేష్ శిండే, ప్రభు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
