రాంపూర్ గ్రామ పంచాయతీ కీలక తీర్మానాలు.
గంజాయి సమాచారం ఇస్తే ₹3,000 బహుమతి – మైనర్లకు మత్తు పదార్థాలు అమ్మితే ₹5,000 జరిమానా.
బోధన్ ప్రతినిధి రాహుల్ :- బోధన్ మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ డోలే సాయికుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో గ్రామ శ్రేయస్సు, యువత భవిష్యత్తు, పిల్లల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని రెండు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఉపసర్పంచ్, వార్డు సభ్యుల సమక్షంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ డోలే సాయికుమార్ మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగం సమాజానికి, ముఖ్యంగా యువతకు తీవ్ర ప్రమాదకరమని పేర్కొన్నారు. గ్రామంలో మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

తీర్మానాల ప్రకారం, రాంపూర్ గ్రామంలో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నా లేదా వినియోగిస్తున్నా వారి సమాచారాన్ని గ్రామ పంచాయతీకి అందజేసిన వారికి ₹3,000 నగదు బహుమతి అందజేయనున్నారు.
అలాగే, 18 సంవత్సరాల లోపు మైనర్లకు సిగరెట్లు, గుట్కాలు, మద్యం లేదా ఇతర హానికర మత్తు పదార్థాలు విక్రయించిన షాపు యజమానులకు ₹5,000 జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు.
గ్రామ పంచాయతీ తీర్మానాలను ఎవరైనా అతిక్రమించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సర్పంచ్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కంటె సాయికుమార్, గ్రామ కార్యదర్శి ఎండీ ఆరీఫ్, వార్డు సభ్యులు గంగుల లక్ష్మణ్, కృష్ణ, మమత, మీనాక్షి, శంకర్, అశోక్తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
