ఖమ్మంలో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచార యత్నం, భవనం పైనుంచి తోసేసిన నిందితుడు అరెస్ట్.
24 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పోక్సో, హత్యాయత్నం కేసులు నమోదు.
ఖమ్మం ప్రతినిధి ఉపేంద్ర: ఖమ్మం నగరంలో ఓ మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసి, విషయం బయటపడుతుందనే భయంతో ఆమెను భవనం పైనుంచి కిందకు తోసేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ఖమ్మం టూ టౌన్ పోలీసులు వేగంగా స్పందించి, ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఖమ్మం నగరంలోని రాపర్తినగర్లో ఉన్న జీ ప్రైడ్ అపార్ట్మెంట్లో మహ్మద్ గౌస్ (57) కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 6వ తేదీన అపార్ట్మెంట్లో ఒక మైనర్ బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన నిందితుడు ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాలిక ప్రతిఘటించడంతో భయపడిన గౌస్, తన నేరం బయటపడుతుందనే ఉద్దేశంతో ఆమెను భవనం పైనుంచి కిందకు తోసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టూ టౌన్ సీఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో నిందితుడిపై పోక్సో చట్టం కిందతో పాటు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.
బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసి, వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, ఘటనా స్థలంలో సేకరించిన ఆధారాల ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
ఈ సందర్భంగా ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి మాట్లాడుతూ, మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో తెలంగాణ పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని, ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే ఈ కేసు అత్యంత సున్నితమైనదని, బాధితురాలి పేరు, ఫోటోలు లేదా గుర్తింపుకు దారితీసే ఎలాంటి సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం చట్టవిరుద్ధమని పోలీసులు స్పష్టం చేశారు. వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ తదితర వేదికల ద్వారా అలాంటి వివరాలను షేర్ చేసినా, ఫార్వార్డ్ చేసినా పోక్సో చట్టం మరియు బీఎన్ఎస్ నిబంధనల కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
