చైతన్య ఒకేషనల్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి: విద్యార్థి సంఘాలు.
గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ – డీఐఈఓకు వినతిపత్రం, విచారణకు హామీ.
బోధన్ ప్రతినిధి రాహుల్: బోధన్ పట్టణంలోని చైతన్య ఒకేషనల్ కళాశాల యాజమాన్యంపై తక్షణ చర్యలు తీసుకుని కళాశాల గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి (డీఐఈఓ)కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకుడు ఎన్. బాల్రాజ్ మాట్లాడుతూ, కళాశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోయినా విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
అడ్మిషన్ సమయంలో స్కాలర్షిప్ల పేరుతో విద్యార్థులను చేర్చుకుని, చదువు పూర్తయిన అనంతరం టీసీ, బోనఫైడ్, మెమోలు వంటి ధ్రువపత్రాలు ఇవ్వాలంటే పూర్తి ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కళాశాల యాజమాన్యంపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డీఐఈఓను కోరినట్లు తెలిపారు.

దీనిపై స్పందించిన డీఐఈఓ, అందిన ఫిర్యాదుపై వెంటనే విచారణ చేపట్టి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు విద్యార్థి నాయకులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో నవతే ప్రతాప్, రాజన్న, ఎండీ మోసిన్, శ్రీకాంత్, రాజు, అవధూత్ ప్రసాద్ తదితర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
