ఓటరు జాబితా సవరణలో పారదర్శకత పాటించాలి: ఎస్ఐఆర్-2026పై బీఎల్ఓలు, ఏఈఆర్‌ఓలకు శిక్షణ.

ఓటరు జాబితా సవరణలో పారదర్శకత పాటించాలి: ఎస్ఐఆర్-2026పై బీఎల్ఓలు, ఏఈఆర్‌ఓలకు శిక్షణ.

ఆర్డీఓ విజయకుమారి ఆధ్వర్యంలో బోధన్ లయన్స్ క్లబ్‌లో అవగాహన కార్యక్రమం.

బోధన్ ప్రతినిధి రాహుల్ : బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2026 సంవత్సరానికి సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)-2026 కార్యక్రమాన్ని పారదర్శకంగా, తప్పులేకుండా నిర్వహించాలని ఆర్డీఓ విజయకుమారి సూచించారు. ఈ మేరకు గురువారం స్థానిక లయన్స్ క్లబ్‌లో బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు), సహాయక ఎన్నికల నమోదు అధికారులు (ఏఈఆర్‌ఓలు) కోసం ప్రత్యేక శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

 

ఈ సందర్భంగా ఆర్డీఓ విజయకుమారి మాట్లాడుతూ, “ఓటరు జాబితా ప్రజాస్వామ్యానికి పునాది. ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా బీఎల్ఓలు, ఏఈఆర్‌ఓలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి” అని సూచించారు. ఇంటింటి సర్వే ద్వారా కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పులు, డూప్లికేట్ ఓట్ల గుర్తింపు వంటి ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.

ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా నిష్పాక్షికంగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బీఎల్ఓ యాప్ వినియోగం, ఓటరు జాబితా సవరణలో సాంకేతిక అంశాలు, ఫారమ్-6, 7, 8ల వినియోగంపై మాస్టర్ ట్రైనర్లు వివరంగా శిక్షణ అందించారు.

 

 

 

అలాగే ఓటరు నమోదు, మార్పులు-చేర్పులు, తొలగింపుల ప్రక్రియను వేగవంతంగా, సమర్థవంతంగా పూర్తి చేసే విధానాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు ఓటర్ల నమోదుకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

 

 

ఈ కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గ పరిధిలోని మండల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్‌ఐలు, రెవెన్యూ మరియు ఎన్నికల విభాగాల సిబ్బంది, బీఎల్ఓలు, ఏఈఆర్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.