తల్లాడలో నూతన ఆర్ఐ బాధ్యతల స్వీకరణ.. సిబ్బంది కొరతపై ఆందోళన.
నవగీతం ప్రతినిధి తల్లాడ ఉపేంద్ర :- తల్లాడ మండల రెవెన్యూ కార్యాలయంలో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నూతన రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ)గా సయ్యద్ వసీం అహ్మద్ బాధ్యతలు స్వీకరించారు. గత కొంతకాలంగా ఆర్ఐ పోస్టులు ఖాళీగా ఉండటంతో రైతులు, విద్యార్థులు వివిధ రెవెన్యూ సేవల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గతంలో మండలంలో ఇద్దరు ఆర్ఐలు విధులు నిర్వహించగా, గత ఏడాది ఏసీబీ కేసులో మాలోత్ భాస్కర్ నాయక్ సస్పెండ్ అయ్యారు. మరో ఆర్ఐ ఖాజామోహినుద్దీన్ డిప్యూటీ తహసీల్దార్గా పదోన్నతి పొంది బదిలీ కావడంతో రెండు పోస్టులు ఖాళీ అయ్యాయి.
ప్రస్తుతం కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాల కోసం విద్యార్థులు, లబ్ధిదారుల రద్దీ పెరిగింది. 19 రెవెన్యూ గ్రామాలు కలిగిన తల్లాడ వంటి మేజర్ మండలానికి ఒక్క ఆర్ఐతో సేవలు అందించడం కష్టసాధ్యమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు తల్లాడ మండలానికి కనీసం ఇద్దరు గిర్దావరీలను (ఆర్ఐలను) నియమించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
