నర్సాపూర్ గేట్ వద్ద విషాదం – కల్లులో మద్యం కలిపి తాగి ఒకరి మృతి, మరొకరు ఆస్పత్రిలో చికిత్స.
బోధన్ ప్రతినిధి రాహుల్: నర్సాపూర్ గేట్ కల్లు కాంపౌండ్ సమీపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కల్లులో మద్యం కలిపి తాగిన కారణంగా విఠల్ (47) అనే వ్యక్తి మృతి చెందగా, అతని స్నేహితుడు లక్ష్మణ్ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం, ఇద్దరూ కలిసి కల్లు సేవించగా అందులో మద్యం కలిసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. అస్వస్థతకు గురైన విఠల్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు సాయి విలాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోధన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై సమాచారం అందడంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బోధన్ ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించారు.
కల్తీ కల్లు విక్రయాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
