నాగిరెడ్డిపేట బస్టాండ్లో పోలీసుల అవగాహన కార్యక్రమం.
నిజామాబాద్ ప్రతినిధి :- నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట బస్టాండ్ ఆవరణలో ఆదివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దొంగతనాల నివారణ, సైబర్ నేరాలపై అప్రమత్తత, హెల్మెట్ వినియోగం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని ప్రజలకు వివరించారు.
కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు నాగిరెడ్డిపేట ఎస్ఐ ఐ.ఏ. భార్గవ్ గౌడ్ సూచనలతో పోలీస్ కళాబృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. సైబర్ నేరాల టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని, OTPలను ఎవరికీ చెప్పవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేయాలని తెలిపారు.

మహిళల భద్రత కోసం షీ టీమ్ సేవలు అందుబాటులో ఉన్నాయని, షీ టీమ్ టోల్ ఫ్రీ నంబర్ 872686094ను అవసరమైన సమయంలో సంప్రదించాలని అవగాహన కల్పించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వేసవిలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేసవి సెలవుల సందర్భంగా చిన్నపిల్లలు ఈతకు వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని తెలిపారు.
పోలీస్ కళాబృందం ఇన్చార్జ్ హెడ్ కానిస్టేబుళ్లు రామంచ తిరుపతి, శేషరావు, కానిస్టేబుళ్లు ప్రభాకర్, సాయిలు పాటలు, ప్రసంగాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి షీ టీమ్ సిబ్బంది శ్రీశైలం, సుప్రజ, శ్రీనివాస్తో పాటు పలువురు ప్రయాణికులు పాల్గొన్నారు.

