శ్రామిక వర్గపక్షపాతి శ్రీశ్రీకి అరుణోదయ ఘన నివాళి.
“శ్రీశ్రీ సాహిత్యం దోపిడీదారులకు సింహస్వప్నం” – అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య.
బోధన్ ప్రతినిధి రాహుల్:- బోధన్ పట్టణంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో మహాకవి, శ్రామిక వర్గపక్షపాతి శ్రీశ్రీకి ఘనంగా నివాళులర్పించారు. తాలూకా రైస్ మిల్ అసోసియేషన్ భవన్లో జరిగిన స్మృతి సభలో శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు కే. గంగాధర్ మాట్లాడుతూ, శ్రీశ్రీ సమాజంలోని వాస్తవాలను తన పదునైన పదాలతో అక్షర రూపంలో ఆవిష్కరించారని అన్నారు. స్వార్థపరులు, లంచగొండులు, శ్రమ దోపిడీదారులకు ఆయన రచనలు సింహస్వప్నంలా నిలిచాయని తెలిపారు.
పీడితులు, తాడితులు, అణగారిన వర్గాలకు శ్రీశ్రీ అండగా నిలిచారని పేర్కొన్నారు. దోపిడీ, దౌర్జన్యాలకు ఇకపై చోటు లేదని ఆయన రచనలు సవాల్ విసిరాయని అన్నారు. శ్రీశ్రీ సాహిత్యం కన్నీటిని ఉప్పెనగా మార్చే శక్తిని కలిగి ఉందని, శక్తిహీనులను పోరాట యోధులుగా తీర్చిదిద్దే ప్రేరణనిస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పి. శంకర్, బి. సాయిలు, దేవయ్య, రమేష్, లాలయ్య, గంగాధర్, రాములు తదితరులు పాల్గొన్నారు.
