బోధన్‌లో సాయి సామల చెస్ అకాడమీ సమ్మర్ క్యాంప్ ముగింపు వేడుకలు ఘనంగా.

 

బోధన్‌లో సాయి సామల చెస్ అకాడమీ సమ్మర్ క్యాంప్ ముగింపు వేడుకలు ఘనంగా.

బోధన్ ప్రతినిధి రాహుల్ :-  బోధన్‌లో సాయి సామల చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన “చెస్ సమ్మర్ క్యాంప్ 2026” ముగింపు కార్యక్రమం మంగళవారం సాయంత్రం రాకాసిపేట్‌లోని భీముని గుట్ట అయ్యప్ప దేవాలయం ప్రాంగణంలో ఘనంగా జరిగింది.

 

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ జడ్జి, మాజీ ద్వితీయ శ్రేణి మేజిస్ట్రేట్ శేష తల్పసాయి హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా రిటైర్డ్ తహసీల్దార్ పి. విశ్వనాథం, ఆర్య సమాజ్ చిదుర ప్రదీప్ గుప్తా, న్యాయవాది మరియు మాజీ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డా. పి. సమ్మయ్య పాల్గొన్నారు.

 

 

 

ఫైనల్ టోర్నమెంట్‌లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు, అలాగే సమ్మర్ క్యాంప్‌లో పాల్గొన్న అందరికీ అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు, ట్రోఫీలు, మెమెంటోలు ప్రదానం చేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రత్యేకంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి శేష తల్పసాయి మాట్లాడుతూ చెస్ క్రీడ విద్యార్థుల్లో ఏకాగ్రత, సహనం, వ్యూహాత్మక ఆలోచనను పెంపొందిస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇలాంటి క్యాంప్‌లు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.

 

 

 

అకాడమీ కోచ్, కోఆర్డినేటర్ సాయిబాబా సామల మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి క్రీడలు అవసరమని, తల్లిదండ్రుల సహకారంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.